
ఏపీలో మరో 2 ఎయిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి జేపీ నడ్డాకు రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొత్త ఎయిమ్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్ను నేషనల్ లెవల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రాంతీయ అసమానతలను తగ్గించి.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో అత్యున్నత వైద్య సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ జనసేన నేత, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు సమానంగా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే.. ఇప్పటికే ఉన్న మంగళగిరి ఎయిమ్స్ను మరింత డెవలప్ చేయడంతోపాటు.. కొత్తగా మరో 2 ఎయిమ్స్లను కేటాయించాలని కోరారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఎంపీ లింగమనేని రమేష్ సుదీర్ఘ లేఖ రాశారు.
కేంద్రమంత్రికి రాసిన లేఖలో రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన పరిస్థితులను లింగమనేని రమేష్ ప్రస్తావించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎయిమ్స్ మాత్రమే ఉండటంతో 3 ప్రాంతాల ప్రజలకు సమానంగా అత్యున్నత వైద్య సేవలు అందడం కష్టంగా మారిందని తెలిపారు. మరీ ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొన్నారు. రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో మరొకటి కలిపి.. రెండు కొత్త ఎయిమ్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. అదే సమయంలో ఎయిమ్స్ మంగళగిరిని పూర్తి స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని లింగమనేని రమేష్ అభ్యర్థించారు.
అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ట్రామా, స్ట్రోక్, అవయవ మార్పిడి చికిత్సలు, చిన్నారుల సూపర్ స్పెషాలిటీ సేవలు, క్యాన్సర్, న్యూరోసైన్సెస్, క్రిటికల్ కేర్ వంటి విభాగాల్లో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోందని కేంద్రమంత్రి జేపీ నడ్డాకు లింగమనేని రమేష్ వివరించారు. అందుకే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎయిమ్స్ ఏర్పాటు చేయడం అనేది అత్యవసరమని అభిప్రాయపడ్డారు.

