
దక్షిణ కోస్తా ఇప్పటికే వ్యవసాయ బలం, జల వనరులు, పారిశ్రామిక అవకాశాలతో ముందంజలో ఉంది. అలాంటి ప్రాంతానికి పరిపాలనా కేంద్రం తోడైతే, సంప్రదాయ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం, నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కూడా తోడయ్యే అవకాశం ఉంటుంది. అదే అమరావతి ప్రణాళిక వెనుక కనిపించే దీర్ఘకాలిక ఆలోచన. అయితే ఏ రాజధాని నగరమైనా కేవలం ప్రభుత్వ నిర్మాణాలతో మనుగడ సాగించలేదు. అక్కడ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఆవిష్కరణ కేంద్రాలు, సాంకేతిక సంస్థలు, స్టార్టప్ వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పుడే అది నిజమైన అభివృద్ధి కేంద్రంగా మారుతుంది.
దక్షిణ కోస్తా అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు నీటి వనరులు, వ్యవసాయం, పోర్టులు, పారిశ్రామిక అవకాశాల గురించి ఎంత చెప్పినా, గత దశాబ్దంలో ఈ ప్రాంత భవిష్యత్తుపై అత్యధిక చర్చకు దారితీసిన అంశం మాత్రం అమరావతి . అయితే అమరావతి గురించి జరిగిన చర్చల్లో చాలా వరకు రాజకీయ వాదోపవాదాలే ప్రధానంగా నిలిచాయి. అభివృద్ధి కోణంలో దాని పాత్ర ఏమిటి? ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎంత? అనే ప్రశ్నలు మాత్రం చర్చకు రాకుండా ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. రాజధాని అంటే కేవలం శాసనసభ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. పరిపాలన, విధాన రూపకల్పన, పెట్టుబడులు, విద్య, వైద్యం, సేవారంగం, సాంకేతిక రంగాలు పరస్పరం అనుసంధానమయ్యే కేంద్రం. ప్రపంచంలోని అనేక ప్రణాళికాబద్ధ నగరాల అనుభవం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.
ఒక సమర్థవంతమైన రాజధాని తన సరిహద్దులకే అభివృద్ధిని పరిమితం చేయకుండా, చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకు కూడా కొత్త ఊపును అందించగలగాలి. ఆ కోణంలో చూస్తే, అమరావతి విజయాన్ని నిర్మించిన భవనాల సంఖ్యతో కొలవడం సరైన ప్రమాణం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎంత స్థిరంగా పనిచేస్తున్నాయి? ప్రైవేట్ పెట్టుబడులను ఎంతవరకు ఆకర్షించగలిగింది? సేవారంగం ఎంత విస్తరించింది? విద్యా, వైద్య సంస్థలు ఎంత వేగంగా అభివృద్ధి చెందాయి? నైపుణ్యాధారిత ఉద్యోగాలకు ఎంత మేర అవకాశాలు సృష్టించబడ్డాయి?… ఈ ప్రశ్నలే అమరావతి అభివృద్ధి విలువను నిర్ణయిస్తాయి.

