
ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు అమెరికా వీసాలు వేగంగా మంజూరు చేయడం, వీసా అపాయింట్మెంట్లు పెంచడం, H-1B వీసా ప్రక్రియను సరళీకరించడం వంటి అంశాలపై చర్చించారు. అమెరికాలోని తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంతో పాటు ఐటీ, ఏఐ, పరిశోధన, స్టార్టప్లు, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని కోరారు. తెలంగాణ–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పరస్పర సహకారం కొనసాగించాలన్నారు.
అమెరికా రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ–అమెరికా మధ్య విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణను అంతర్జాతీయ విద్యా, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి రాయబారికి వివరించారు.
తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో వారికి వీసాలు సకాలంలో లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్లు త్వరగా లభించేలా చూడాలని, వీసా ఇంటర్వ్యూ స్లాట్ల సంఖ్యను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. దీంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులు, ఇంజినీర్లు, వైద్యులు, పరిశోధకులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సీఎం రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా H-1B వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియల్లో జాప్యం లేకుండా సరళీకరణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే అమెరికా వీసా విధానాల్లో చోటుచేసుకునే మార్పులపై ముందస్తుగా స్పష్టమైన సమాచారం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. దీంతో విదేశాల్లో పనిచేస్తున్న నిపుణులు, వారి కుటుంబాలు అనిశ్చితికి గురికాకుండా ఉంటారని అభిప్రాయపడ్డారు.

