
కేబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వ్యూహం, ప్రజా సమస్యలు, ఎల్నినో పరిస్థితులు తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసిన ఆయన, ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రతి మంత్రి, ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి కనీసం మూడు నిమిషాలైనా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఇంటింటా ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రధాన అంశాలపై కూడా సమావేశంలో లోకేష్ మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులను శాసనసభ వేదికగా ప్రజలకు సమగ్రంగా వివరించాలని సూచించారు. ఇటీవల జలాశయాలకు వరద నీరు చేరడం కొంత ఊరటనిచ్చే పరిణామమే అయినప్పటికీ, నీటి వినియోగంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నీటి నిర్వహణలో మొదటి ప్రాధాన్యత తాగునీటి అవసరాలకు, రెండో ప్రాధాన్యత పశుసంవర్థక, పశుగ్రాస అవసరాలకు ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీని ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనే వేదికగా వినియోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, సుస్థిర పరిపాలనకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బ్రేక్ఫాస్ట్ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

