
ప్రతిష్టాత్మక 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం అర్హత టోర్నీ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రణాళికను సిద్ధం చేసింది. 2027 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించే ప్రధాన ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు 12 వేదికల్లో జరగనుంది.
ఈసారి అమలు చేస్తున్న కొత్త ఫార్మాట్ ప్రకారం.. క్వాలిఫయర్ టోర్నీలో 10 జట్లు పోటీపడతాయి. ఇందులో ఛాంపియన్గా నిలిచిన జట్టు నేరుగా 14 జట్లతో జరిగే ప్రధాన ప్రపంచకప్ గ్రూప్ దశకు అర్హత సాధిస్తుంది. రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిరీస్ తొలి దశలో తలపడతాయి. ఆ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచే జట్టుకు ప్రధాన టోర్నీలో చోటు దక్కుతుంది.
క్వాలిఫయర్ టోర్నీలో జట్ల ఎంపిక విధానాన్ని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. 2026 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే మినహా అత్యల్ప ర్యాంక్లో ఉన్న రెండు ఫుల్ మెంబర్ జట్లు క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. వీటితో పాటు సీడబ్ల్యూసీ లీగ్-2 నుంచి టాప్-4 జట్లు, అలాగే క్వాలిఫయర్ ప్లేఆఫ్స్ నుంచి టాప్-4 జట్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతాయి. ప్లేఆఫ్స్ కోసం లీగ్-2లోని చివరి నాలుగు జట్లు, ఛాలెంజ్ లీగ్ నుంచి అర్హత సాధించిన నాలుగు జట్లు పోటీ పడతాయి. ఛాలెంజ్ లీగ్లో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశ మ్యాచ్లు నిర్వహించనున్నారు.
మరోవైపు మాజీ ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్న విండీస్.. సెప్టెంబర్ కట్ఆఫ్కు ముందు భారత్తో కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడనుంది. అదే సమయంలో అఫ్గానిస్థాన్ (8వ ర్యాంక్), ఐర్లాండ్ (12వ ర్యాంక్) మధ్య జరిగే సిరీస్ ఫలితాలు కూడా విండీస్ అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి. ఐర్లాండ్ 4-1 లేదా 5-0 తేడాతో అఫ్గానిస్థాన్ను ఓడించి, విండీస్ భారత్పై రెండు మ్యాచ్లు గెలిస్తే టాప్-8లోకి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అఫ్గానిస్థాన్ సిరీస్ గెలిస్తే మాత్రం వెస్టిండీస్ మరోసారి క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 2023 ప్రపంచకప్కు నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో అర్హత కోల్పోయిన వెస్టిండీస్, ఈసారి ప్రధాన టోర్నీలో చోటు దక్కించుకోవడం మరోసారి కఠిన సవాల్గా మారింది.

