
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కుప్పం రైతులకు సంబంధించిన భూములకు పరిహారం ఫిక్స్ చేసింది. కేటి పట్టాలు లేని, వారసత్వ భూములు, ఎన్నో ఏళ్లుగా అనుభవంలో సాగు చేసుకుంటున్న భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల్ని ప్రభుత్వం పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోబోతోంది. ఎకరా రూ.12.44 లక్షల చొప్పున చెల్లించి ఈ భూమిని కుప్పం ఎయిర్పోర్ట్ కోసం తీసుకుంటోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ రైతులకు జాక్పాట్ తగిలింది. ఎన్నో ఏళ్లుగా భూమికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్న రైతులకు ఊరట దక్కింది. డీకేటి పట్టాలు లేని, వారసత్వ భూములు, ఎన్నో ఏళ్లుగా అనుభవంలో సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని మొత్తం 143 మంది రైతులకు సంబంధించి 178.32 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని ఎకరాకు రూ.12.44 లక్షల వంతున పరిహారం చెల్లించి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కుప్పం నియోజకవర్గం పరిధిలోని రామకుప్పం మండలం మణేంద్రంలోని 33 మందికి 48.11 ఎకరాలు, కిలకిపోడులో 44 మంది రైతులకు సంబంధించి 46.74 ఎకరాలు, కడసినకుప్పంలో 20 మందికి 10.78 ఎకరాలు, , బొందలగుంటలో ఐదుగురు రైతులకు 3.37 ఎకరాలు ఉన్నాయి. అలాగే శాంతిపురం మండలం అమ్మవారిపేటలో 29 మంది రైతులకు 51.23 ఎకరాలు, సొన్నెగానిపల్లెలో ఐదుగురు రైతులకు 10.32 ఎకరాలు, దండికుప్పంలో ఏడుగురు రైతులకు 7.76 ఎకరాలు భూమి ఉంది. శాంతిపురం, రామకుప్ప మండలాల్లో ఎయిర్పోరట్ ప్లాన్ చేయగా.. ఇప్పటికే 1405 ఎకరాల భూసేకరణకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేశారు. కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చిన భూములు కాకుండా అదనంగా భూములు అవసరమయ్యాయి.
అందుకే జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ డీకేటీ పట్టాలు, ఇతర రికార్డుల్లేకుండా ఉన్న భూములకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవాలని భావించారు. ఈ భూములకు పట్టా లేకపోయినా రైతులు గయ్యాలు, గుట్ట పోరంబోకు భూముల్ని ఖర్చు చేసి సాగు చేస్తున్నారని కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ భూములు వర్షాధారంగా సాగవుతున్నాయని.. పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి అక్కడి స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా స్పందించింది. ఈ భూములకు సంబంధించి పట్టాలు లేకున్నా పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. వన్టైమ్ సెటిల్మెంట్గా పరిగణించి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ఆధారంగా భవిషత్తులో పరిహారం కోసం ఎవరూ డిమాండు చేయరాదనే నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేశారు.

