
శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీహెచ్సీ ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టిన అనంతరం మండల వైద్యాధికారి రాధాకృష్ణన్కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టు సిబ్బంది మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, వైద్య సెలవులు, ఆరోగ్య కార్డుల సౌకర్యాలు కల్పించాలని, అలాగే కాంట్రాక్టు సిబ్బందికి బదిలీల సౌకర్యం కల్పించాలని కోరారు.
తమ డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 8 వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని సిబ్బంది తెలిపారు. అప్పటిలోగా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పారామెడికల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. సతీష్, ఫార్మసిస్ట్ లక్ష్మీనారాయణ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

