
విశాఖపట్నం పోర్టులో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కాలుష్య నియంత్రణకు అధికారులు నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పలు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ వాటి అమలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా సరకు నిల్వ, రవాణా కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారులు కాలుష్య నియంత్రణ చర్యలకు సహకరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో పాత పద్ధతుల్లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖపట్నం పోర్టులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ‘నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) కింద పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుమ్ము ధూళి నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే సరకు రవాణా వాహనాలపై భారీగా జరిమానాలు విధించాలని సూచించింది.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో గత జూలై 17న పర్యావరణ పర్యవేక్షణ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాలుష్య నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పోర్టులో సరకు రవాణా చేసే బీఓటీ పీపీపీ ఓ అండ్ ఎం ఆపరేటర్లు కమిటీ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పోర్టు యూజర్లు కూడా కాలుష్య నివారణ చర్యలకు సహకరించాలని స్పష్టం చేసింది.

