
ఈ నెల 13న అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడుతోంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రాజధాని ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (సబ్ ఆర్టీరియల్ E3 రోడ్డు), ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీ సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేశాయి.
సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏడీసీ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి. లక్ష్మీపార్థసారథి, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు
అమరావతి మౌలిక వసతుల్లో కీలకమైన ప్రాజెక్టుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు ఒకటి. E3 రోడ్డుగా పిలిచే ఈ రహదారి రాజధానిలోని N1 నుంచి N17 వరకు ఉన్న ప్రధాన రోడ్లను అనుసంధానిస్తుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో 60 మీటర్ల వెడల్పున ఈ రహదారిని నిర్మిస్తున్నారు.
దొండపాడు వద్ద ప్రారంభమయ్యే ఈ రహదారి రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా సాగి మణిపాల్ హాస్పిటల్స్ సమీపంలో జాతీయ రహదారి-16 (NH-16)తో అనుసంధానమవుతుంది. మూడు దశల్లో అభివృద్ధి చేసిన ఈ రహదారి అమరావతి రవాణా వ్యవస్థలో కీలకమైన అనుసంధాన మార్గంగా నిలవనుంది.

