
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ 14 రోజులైనా లభించలేదు. ఆగస్టు 3న వేటకు వెళ్లిన వారు గంట తర్వాత స్థానికులతో కమ్యూనికేషన్ కోల్పోయారు. పది రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా ఇప్పటికీ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాలింపు చర్యల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

