
పుణెలోని ఓ ప్రముఖ స్వీట్ షాపు నిబంధనలు పాటించడం లేదంటూ ఎఫ్డీఏ అధికారులు దాని లైసెన్సును రద్దు చేశారు. అయితే, యాజమాన్యం లోపాలను సరిదిద్దుకుని, మరోసారి తనిఖీలు నిర్వహించాలని అధికారులను కోరింది. దీంతో అధికారులు పునఃపరిశీలన చేపట్టగా.. పారిశుద్ధ్య ప్రమాణాల్లో షాపు ఏకంగా 98 శాతం మార్కులు సాధించింది.
అయినప్పటికీ సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తమకు అన్యాయం జరిగిందంటూ షాపు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఎఫ్డీఏ అధికారుల తీరును తప్పుబట్టింది. బాధితులకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఫుడ్ అథారిటీలు జరిమానాలు విధించడం, లైసెన్సులు రద్దు చేయడం చూస్తుంటాం. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. నిబంధనలు పాటించని దుకాణానికి కాకుండా.. నిబంధనలు పాటిస్తున్న ఓ స్వీట్ షాపు లైసెన్సును పునరుద్ధరించకుండా నిర్లక్ష్యం చేసిన ఫుడ్ అథారిటీకే బాంబే హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది.
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) పరిధిలోని అధికారులు పుణేలోని ఓ ప్రముఖ స్వీట్ షాపుపై చర్యలు తీసుకున్నారు. అయితే, అనంతరం నిర్వహించిన ఆహార భద్రత, పారిశుద్ధ్య తనిఖీల్లో ఆ షాపు ఏకంగా 98 శాతం నిబంధనలు పాటించినట్లు తేలింది. అయినప్పటికీ లైసెన్స్పై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయకుండా అధికారులు వ్యవహరించడంతో యాజమాన్యం ఆర్థికంగా నష్టపోయింది.
దీనిపై షాపు యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఎఫ్డీఏ అధికారుల తీరును తప్పుబట్టింది. నిబంధనలు పాటిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైనప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించకపోవడం వల్ల షాపు యాజమాన్యానికి నష్టం కలిగిందని గుర్తించింది. దీంతో బాధితులకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఎఫ్డీఏను ఆదేశించింది.
అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఎఫ్డీఏ ఎందుకు చర్యలు తీసుకుంది? కోర్టు ఎందుకు జరిమానా విధించింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జూన్ 12న ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించిన ఫిర్యాదు అందడంతో ఎఫ్డీఏ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పుణేలోని గురునాథ్ డెయిరీ అండ్ స్వీట్స్ సంస్థలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పారిశుద్ధ్య లోపాలు గుర్తించడంతో.. అదే రోజు సంస్థ లైసెన్స్ను అధికారి సస్పెండ్ చేశారు.
అయితే, ఆ తర్వాత యాజమాన్యం గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని, లైసెన్స్పై సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఎఫ్డీఏ కమిషనర్కు విజ్ఞప్తి చేసింది. దీంతో జులై 13న అధికారులు మరోసారి సంస్థను తనిఖీ చేశారు. ఈ పునఃపరిశీలనలో గురునాథ్ డెయిరీ అండ్ స్వీట్స్ ఏకంగా 98 శాతం నిబంధనలను పాటిస్తున్నట్లు తేలింది.
అయినప్పటికీ సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చేసేదేమీ లేక సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. సస్పెన్షన్ కారణంగా షాపు మూతపడటంతో తమకు రూ.8.74 లక్షల ఆదాయం నష్టపోయినట్లు వ్యాపారులు కోర్టుకు వివరించారు.

