
ఇటీవల ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న నేపాల్.. ప్రపంచ దేశాలను సంచలన డిమాండ్ చేసింది. వరదల్లో వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సహాయక చర్యలు, పునరావాసం, పునర్నిర్మాణానికి భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో పలు దేశాలు నేపాల్కు సాయం చేస్తున్నాయి.
అయితే తమకు దయతో చేసే సాయం అవసరం లేదని.. వాతావరణ మార్పుల కారణంగా జరిగిన నష్టానికి నైతిక బాధ్యతగా పరిహారం చెల్లించాలని నేపాల్ స్పష్టం చేసింది. అధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలు తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ కనాల్ డిమాండ్ చేశారు.
నేపాల్ స్వల్ప స్థాయిలోనే కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నప్పటికీ.. వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావాలను ఎదుర్కొంటోందని మంత్రి పేర్కొన్నారు. అధిక గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు చేసే దేశాలకు, వాతావరణ మార్పులతో నష్టపోతున్న దేశాల పట్ల బాధ్యత ఉందన్నారు. ఇకపై సాయం కోరే విధానం కాకుండా న్యాయబద్ధమైన పరిహారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
వాతావరణ పరిహారం కోసం నేపాల్ ఇప్పటికే అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలకు క్లెయిమ్ పంపినట్లు మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై బలంగా లేవనెత్తడంతో పాటు ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యూఎన్ 81వ సర్వసభ్య సమావేశంలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా వరదలు, వాతావరణ మార్పుల ప్రభావాలపై మాట్లాడే అవకాశం ఉంది.
