
రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వారం వ్యవధిలో ఏపీలో ముగ్గురు అమ్మాయిలు బలైపోయారని.. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయని మండిపడ్డారు. ప్రియాంక కేసులో టీడీపీ, వైసీపీలు లాలూచీ అయ్యాయని.. దీనిపై మాట్లాడేవారే లేకుండా పోయారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని అధికార టీడీపీ కూటమి, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించిన విజయసాయిరెడ్డి.. ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా? శాపమా? అంటూ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఆడపిల్లల ప్రాణాలు అమానుష రీతిలో బలైపోయాయని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మెడికో ప్రియాంక, చిలకలూరిపేటలో షేక్ హసీనా, విజయవాడకు చెందిన షేక్ ఆసిఫా ఉదంతాలను ట్వీట్లో ప్రస్తావించారు.
రాజమండ్రిలో ప్రియాంకను దారుణంగా నడిరోడ్డుమీద తొక్కించి చంపేస్తే.. కారణమైన వారిని ఉరితీయాలని ప్రియాంక తండ్రితప్ప, బడా నాయకులు ఎవరూ మాట్లాడటం లేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంపేసిన వారికి వైసీపీలోని ఓ వర్గం నేతలు, టీడీపీలోని మరో వర్గం నాయకులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రెండు బలమైన పార్టీలు లాలూచీ అయితే, రాష్ట్రంలో ఏ మనిషి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి.. ప్రియాంక కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
చిలకలూరిపేటలో షేక్ హసీనా అనే ఆడబిడ్డను దారుణంగా చంపి, శవాన్ని కూడా తగలబెట్టారన్న విజయసాయిరెడ్డి.. ఈ కేసులో అటు ప్రభుత్వం గానీ, ఇటు వైసీపీలో కానీ పెద్దగా చలనం లేదని విమర్శించారు. ఈ ఘటనను ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు వ్యవహారంగా చూపి, హసీనా కేసును అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె, షేక్ ఆసిఫా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అంటున్నారని.. రోడ్డు ప్రమాదానికి కారణాలేమిటి? ఓవర్ స్పీడింగ్ మాత్రమేనా అనే దానిపై నిజాలు చెప్పడం లేదని విమర్శించారు.

