
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్లో జరిగే తుది సమరంలో చోటు దక్కించుకునేందుకు ప్రతి జట్టు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఆస్ట్రేలియా అత్యంత సౌకర్యవంతమైన స్థితిలో ఉండగా, భారత జట్టు తన మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 8 విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. పాక్కు కూడా అవకాశాలు తక్కువే.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రధాన జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. రెండో ప్లేసులో సౌతాఫ్రికా ఉన్నాయి. ఇక భారత్ ఐదో ప్లేసులో ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-2027లో మ్యాచులు పూర్తయ్యే సరికి టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పాయింట్స్ టేబుల్ ప్రకారం.. ఏ జట్లు ఎన్ని మ్యాచులలో గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ చేరాలంటే తమ మిగిలిన 14 టెస్టుల్లో 8 విజయాలు సాధిస్తే సరిపోతుంది. ఆ జట్టు భారత గడ్డపై ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది. ప్రస్తుత ఛాంపియన్ సౌతాఫ్రికాకు ఉన్న 10 మ్యాచుల్లో 6 విజయాలు అవసరం కాగా, న్యూజిలాండ్ 10 టెస్టుల్లో 7 విజయాలు నమోదు చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ తాము ఆడాల్సిన 8 మ్యాచుల్లో 6 గెలవాల్సి ఉంది.
ఇక టీమిండియా విషయానికి వస్తే.. 90 శాతం మ్యాచులు గెలవాల్సిన పరిస్థితి ఉంది. భారత్ ఇంకా.. 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 8 గెలిస్తేనే.. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. దీంతో రాబోయే శ్రీలంక సిరీస్లో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత్కు అత్యంత కీలకంగా మారనున్నాయి.
శ్రీలంక 8 టెస్టుల్లో 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే ఫైనల్ రేసులో నిలవగలదు. పాకిస్థాన్.. మిగిలిన ఏడు మ్యాచులలోనూ గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు దాదాపుగా ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే ఇతర జట్ల మ్యాచులు డ్రాగా ముగిస్తే, తక్కువ విజయాలతో కూడా కొన్ని జట్లకు సమీకరణాలు మారే అవకాశముంటుంది. ఇంగ్లాండ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

