
వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే నల్లమల పరిసర గ్రామాలు, ప్రాంతాలలో ఇటీవలి కాలంలో నన్నారి సాగు పెరుగుతోంది. పెట్టుబడి తక్కువ, రసాయనిక ఎరువుల వాడకం లేని ఈ నన్నారి సాగు రైతులను ఆకర్షిస్తోంది. ఈ పంట సాగుపై పూర్తి అవగాహన తెచ్చుకుని పండిస్తే.. లక్షల్లో ఆదాయం పొందవచ్చని రైతులు చెప్తున్నారు.
వైవిధ్యభరితమైన పంటల సాగువైపు మొగ్గు చూపే రైతులకు నన్నారి సాగు మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అడవిలో పెరిగే ఈ నన్నారి (సుగంధ పాలు) మొక్కను సాగు చేసేందుకు ఇప్పుడు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అటవీ ప్రాంతాలలోని గిరిజనులతో పాటుగా బీడు భూముుల్లోనూ రైతులు ఈ నన్నారిని సాగు చేస్తూ సిరులు కురిపిస్తున్నారు. నన్నారి వేర్లతో తయారు చేసే షర్బత్ (పానీయాలకు) మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం, నన్నారి సాగులో చీడపీడల సమస్యల లేకపోవటం ఈ పంట సాగువైపు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో నల్లమల పరిసర ప్రాంతాల రైతులు నన్నారి సాగును ఉపాధిగా మలుచుకున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఐటీడీఏ ద్వారా నన్నారి సాగును ప్రోత్సహిస్తోంది.
కొండ ప్రాంతాలలో దొరికే నన్నారి మొక్కలను ఇప్పుడు నర్సరీలలోనూ పెంచుతున్నారు. విత్తనాలను సేకరించి నర్సరీలలో పెంచుతున్నారు. 30 నుంచి 45 రోజులు ఉన్న నన్నారి మొక్కలు నాటడానికి అనుకూలంగా, సిద్ధంగా ఉంటాయి. వాటిని భూమిలో నాటుకోవాలి. చౌడు భూములు మినహాయించి అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలమని వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు. మొక్కలు నాటే సమయంలో సాలుకు సాలుకూ మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మొక్కల మధ్యన రెండు అడుగులు దూరం ఉండేలా చూడాలి. నాటిన 30, 60 రోజుల వ్యవధిలో కలుపు తీయాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో సాగు చేస్తే నీటి అవసరం పెద్దగా ఉండదని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. మొక్కలు త్వరగా బతకవని.. ఏడాది వరకూ జాగ్రత్తగా గమనించుకోవాలని సూచిస్తున్నారు. నన్నారి వేర్లు పక్వానికి వచ్చేందుకు మూడేళ్ల సమయం పడుతుందని.. అప్పటి వరకూ వేచిచూస్తే లాభాలు ఆర్జించవచ్చని చెప్తున్నారు. నన్నారి వేర్లలో తల్లి వేరును కత్తిరించకుండా అలాగే ఉంచి.. మిగతా పిల్లవేర్లను వాడుకుంటే 12 సంవత్సరాల పాటు ఆదాయం ఆర్జించవచ్చని చెప్తున్నారు. ఒక్కో మొక్క నుంచి ఏటా కిలో నుంచి 3 కేజీల వరకూ పిల్లవేర్లు సేకరించవచ్చని.. కిలో నన్నారి గడ్డలు మార్కెట్లో 500 రూపాయలకు పైగానే పలుకుతున్నాయని వివరిస్తున్నారు. ఒక ఎకరా భూమిలో 12 వేల నుంచి 15 వేల మొక్కలు సాగు చేయవచ్చని రైతులు చెప్తున్నారు.

