
శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. వీఐపీల రెఫరల్ లేఖలు 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి చేర్చాలని సూచించారు. తిరుమల తరహాలో వీఐపీ లేఖలు వచ్చిన వాటిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వారికి మెస్సేజ్ వెళ్తుందని చెప్పుకొచ్చారు.
భక్తులు ఎక్కువసేపు కార్యాలయాల వద్ద వేచి ఉండకుండా నూతన విధానాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువస్తామని ఆలయ ఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ అనుమతితో ట్రస్ట్ బోర్డు ఆమోదంతో వీఐపీల దర్శనాల్లో టికెట్లను స్లాట్ పద్ధతుల్లో మార్పులు చేశామని వెల్లడించారు.
సామాన్య భక్తులకు దర్శనాల సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు దర్శనాల వేళల్లో మార్పులు చేశామని చెప్పుకొచ్చారు. శ్రీశైలం అలయానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో దర్శనాల వేళల్లో మార్పులు చేశామని వివరించారు. శని, ఆది, సోమవారాలు రద్దీ రోజుల్లో రోజుకు రెండు విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ ఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

