
ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడితో హిలోరా ఎకో రిసార్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఏవీఎన్జీ డెవలపర్స్ ఆధ్వర్యంలో హిలోరా ఎకో రిసార్ట్స్, ది ఓజోన్ కలెక్షన్, కలర్స్ ఆఫ్ ఓ బ్లూ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఎస్.కోట ప్రాంతాన్ని ఊటీ, కొడైకెనాల్ తరహాలో అభివృద్ధి చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ రిసార్ట్ ఉత్తరాంధ్ర పర్యాటక రంగంలో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. రెండేళ్లలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
భీమిలి-భోగాపురం మధ్య మరో బీచ్ రిసార్ట్
మరోవైపు భీమిలి-భోగాపురం తీర ప్రాంతంలో రూ.18 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు బ్లూబే ఇన్ఫ్రా సంస్థ సిద్ధమవుతోంది. వెయ్యి చదరపు గజాల స్థలంలో 36 గదులతో ఈ రిసార్ట్ను నిర్మించనున్నారు.
బాలి తరహా డిజైన్తో ఐదు స్విమ్మింగ్ పూల్స్, డ్యూప్లెక్స్ గదులు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యూనిట్లో నాలుగు బెడ్లు, మీటింగ్ రూమ్, కిచెన్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. సుమారు 100 మంది వరకు వేడుకలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యాటక రంగంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

