
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆరోపిస్తూ సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. ఐసీయూ, ఎమర్జెన్సీ, ఆపరేషన్ థియేటర్లలో విధులను బహిష్కరించడంతో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
జూనియర్ డాక్టర్ల నిరసనలు ప్రారంభమై ఎనిమిది రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (APJUDA) తెలిపింది. మాతా శిశు సంరక్షణతో పాటు ఇతర అత్యవసర వైద్య సేవలపై ప్రభావం పడకుండా ఆస్పత్రి యాజమాన్యాలు సీనియర్ వైద్యులు, అసిస్టెంట్ సర్జన్లతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి.
జూడాల ప్రధాన డిమాండ్లు
జూనియర్ డాక్టర్లు ప్రధానంగా మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. 2026 జనవరి నుంచి అమలు కావాల్సిన స్టైఫండ్ను 30 శాతం పెంచాలని కోరుతున్నారు. అలాగే సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలకు అనుగుణంగా మాత్రమే MSc, PhD అభ్యర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించాలని జూడాలు కోరుతున్నారు.
స్టైఫండ్ పెంపుపై జనవరి నుంచే ప్రభుత్వానికి అధికారికంగా లేఖలు రాస్తున్నప్పటికీ స్పందన రాలేదని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం చర్చలకు ముందుకొస్తే తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో చర్చలు జరుపుతోంది.

