
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవిశాఖపట్నం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. సాగర తీరం విశాఖను ఏపీ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలి వస్తున్నాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయి.
దీంతోవిశాఖపట్నం సహా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంక్రమంగా పుంజుకుంటోంది. దీనికి తగినట్లుగానే నిర్మాణ రంగం కూడా పుంజుకుంది. అయితే విశాఖలో నిర్మాణ రంగాన్ని ఓ సమస్య ఇబ్బంది పెడుతోందని నిర్మాణ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతున్నాయి, అయితే నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా విశాఖపట్నం నగర వృద్ధి మందగిస్తోందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్-సిటీ అప్గ్రేడ్లు, విమానాశ్రయ విస్తరణ, గృహనిర్మాణ ప్రాజెక్టులలో పురోగతి ఉన్నప్పటికీ.. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా వీటి అమలు ఆలస్యం అవుతోందని అంటున్నారు.
ఫలితంగా ఖర్చులను పెంచుతోందని కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అనుభవజ్ఞులైన మేసన్లు, ఎలక్ట్రీషియన్లు, ఫినిషింగ్ కార్మికులు దొరకడం లేదని చెప్తున్నారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందని.. ఫలితంగా ఖర్చులు పెరగడమే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని చెప్తున్నారు.
