
ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్లో దూసుకెళ్తోన్న దిగ్గజం ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్తో కలిసి భారత్లో తొలి ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఏపీలోని అనకాపల్లిలో (విశాఖపట్నం) టీసీఎస్కు 200 ఎకరాల భూమి కేటాయించగా, గూగుల్ ఇప్పటికే సమీపంలో మెగా డేటా సెంటర్ నిర్మిస్తోంది. దీంతో విశాఖ- అనకాపల్లి ఏఐ హబ్గా ఎదిగే అవకాశాలు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్- దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా అవతరించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో టెక్ దిగ్గజం గూగుల్ తన భారీ హైపర్స్కేల్ డేటా సెంటర్ నిర్మిస్తుండగా- ఇప్పుడు ప్రపంచ దిగ్గజ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్తో చేతులు కలపడం ద్వారా అదే ప్రాంతంలో మరో మెగా ఏఐ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. అమెరికా బయట ఓపెన్ ఏఐ చేపడుతున్న అతిపెద్ద ఏఐ విస్తరణ ప్రణాళికలో భాగంగా టీసీఎస్- విశాఖపట్నం, పుణెల్లో డేటా సెంటర్ల కోసం భూముల్ని సమీకరించడం దేశ ఐటీ రంగంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు కూడా గొప్ప ఊతంగా భావిస్తున్నారు.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా ఎదగాలని టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఏఐ కంప్యూటింగ్, క్లౌడ్ సేవలు, డేటా స్టోరేజ్, ప్రభుత్వం, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్ కేర్ రంగాలకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాల్ని భారత్లోనే అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది.

