
మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇళ్ల పట్టాల రద్దుకు సంబంధించి నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ, పురపాలక శాఖల అధికారులకు సూచించింది. అధికారులపై తీసుకునే చర్యలపైనా నివేదిక సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇళ్ల పట్టాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని ఆదేశించింది. నాలుగువారాలు గడువు ఇస్తున్నట్లు రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల్ని ఆదేశించింది. ఈ పట్టాలకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నకిలీ పట్టాలు పంపిణీకి సహకరించిన అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుని.. ఆ వివరాలు కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం సూచించారు.
2024 ఎన్నికలకు ముందు మచిలీపట్నంలో ఉన్న రోడ్డు, రోడ్డు మార్జిన్, శ్మశాన వాటికలు, డ్రైనేజీ పోరంబోకు భూముల్లో ఈ పట్టాలను పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని టీడీపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు, ఇతర వ్యక్తులపై క్రిమనల్ కేసులు నమోద చేయాలన్నారు. ఈ పిల్పై జరిగిన విచారణలో వాదనలు జరిగాయి.
మచిలీపట్నంలో నకిలీ పట్టాలు పంపిణీ చేశారని వాస్తవమేనని స్వయంగా అధికారులు తేల్చారన్నారు పిటిషనర్ తరఫు లాయర్. అసలు పట్టాలు జారీ చేసే సమయంలో కానీ బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం ఈ పిల్ వేశారని పేర్ని నాని తరఫున లాయర్ వాదించారు. రాజకీయ పార్టీతో పిటిషనర్కు అనుంబంధం ఉందని.. వాస్తవాలు దాచేసి పిల్ దాఖలు చేశారన్నారు. అయితే ఒకవేళ పిటిషనర్ వాస్తవాలను దాచి పిల్ వేసినట్లు తేలితే ఖర్చులు విధిస్తామని హైకోర్టు తెలిపింది. మొత్తం మీద నకిలీ పట్టాల అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగు వారాలే గడువు ఉండటంతో.. మరి అధికారులు ఈ పట్టాల అంశం, అధికారులపై చర్యల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.

