
క్యూర్ పరిధిలో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని.. కేవలం ఆధార్, ఫోన్ నంబర్లు ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజును యూపీఐ ద్వారా చెల్లించవచ్చునని.. ఇల్లు మంజూరు కాకపోతే మరుసటి రోజే ఆ మొత్తం సంబంధిత ఖాతాలో రీఫండ్ అవుతుందని వెల్లడించారు.
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులకు దరఖాస్తు ప్రక్రియను అత్యంత సులభతరం చేసినట్లు హౌసింగ్ శాఖ కమిషనర్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో గత పదేళ్లుగా అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఈ ఇందిరమ్మ ఇళ్లకు పూర్తి అర్హులని ఆయన స్పష్టం చేశారు. చాలామంది దరఖాస్తుదారులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని అయితే ఈ పథకానికి ఎలాంటి సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు.
దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, అనుసంధానమైన ఫోన్ నంబరు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. వివాహం కాని యువతీ యువకులు అన్మ్యారీడ్ ఆప్షన్ను ఎంచుకుని తమ తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యలను నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. పథకం గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్కు పెద్ద ఎత్తున విచారణలు వస్తున్నాయని కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన తొలివిడత 16 నియోజకవర్గాల్లో ఉంటున్నవారు ప్రస్తుతం తాము నివసిస్తున్న వార్డు, సర్కిల్, నియోజకవర్గాల వివరాల ఆధారంగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆధార్లో వేరే చిరునామా ఉన్నప్పటికీ ప్రస్తుత నివాస ప్రాంతం ఆధారంగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్లో ప్రత్యేక ఆప్షన్లు కల్పించామన్నారు.

