
నర్సాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నర్సాపురం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జేసీ కల్పశ్రీతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
నర్సాపురం నదీతీరంలోని పొన్నపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోటు ప్రయాణ సదుపాయాలను పరిశీలించిన అధికారులు.. ఏర్పాట్లపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోటును స్వయంగా పరిశీలించిన కలెక్టర్, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా చర్యలను కట్టుదిట్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలవనున్న మత్స్యకారులతో అధికారులు మాట్లాడి.. వారి వృత్తి, చేపల వేటకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
వశిష్ఠ గోదావరి నదీతీరంలో సీఎం పర్యటనకు సంబంధించి పోలీసు, రెవెన్యూ అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం, పింఛన్ల పంపిణీ, బోటు ప్రయాణం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
బోటును డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు మత్స్యకారులను కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. సీఎం పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
