
విజయవాడ: నగరంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూ.60 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ప్రారంభించారు. నూతన డెంటల్ చైర్స్, సీసీ రోడ్లు, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. కళాశాల ఆవరణలో పలు మౌలిక వసతుల పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. 24 బెడ్లు, సీసీ రోడ్లను ప్రారంభించామని, రోజుకు సుమారు 500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. పేషెంట్ల కోసం షెడ్లు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు
ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు ఎంతో చరిత్ర ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో కళాశాల పరిసరాల్లో వర్షాకాలంలో మోకాళ్ల లోతు నీరు నిలిచేదని, అనంతరం సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రూ.60 లక్షలతో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు, రోగులకు అవసరమైన మరిన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రోజుకు 5 వేల మంది వరకు ఓపీకి వచ్చే స్థాయిలో సేవలను విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
