
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ శ్రావణ మాసం సందర్భంగా శివాలయానికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. నల్లటి టీషర్ట్, జీన్స్ ధరించి, కళ్లకు సన్గ్లాసెస్తో శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఆమె కనిపించారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ దేవుడిని ప్రార్థించినప్పటికీ, ఆలయంలో కనీసం సన్గ్లాసెస్ తీయకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “దేవుడి ముందు భక్తి చూపిస్తున్నారా లేక ఫోటోషూట్ చేసుకుంటున్నారా?” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ విభిన్నమైన పాత్రలతోనే కాకుండా, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర వివాదానికి దారితీశాయి. పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భూమి పెడ్నేకర్ సమీపంలోని ఒక శివాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి, జలాభిషేకం నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టానికి సంబంధించిన వీడియోను, ఫోటోలను ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. “ఈ శ్రావణ మాసంలో నా జీవితం సులభంగా మారిపోవాలని కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్” అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు.
అయితే ఈ వీడియోలో భూమి కనిపించిన విధానం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. నల్లటి టీషర్ట్, జీన్స్ ధరించిన ఆమె, కళ్లకు సన్గ్లాసెస్ పెట్టుకునే శివలింగానికి అభిషేకం చేస్తూ కనిపించారు. పవిత్రమైన ఆలయంలోకి వెళ్లి దేవుడికి పూజలు చేసేటప్పుడు కనీసం కళ్లజోడు తీసేయాలనే సంస్కారం లేదా అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “దేవుడి ముందు నిజమైన భక్తి చూపిస్తున్నారా? లేక ఫోటోషూట్ చేస్తున్నారా?”, “ఆలయ సంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వాలి” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. దుస్తులు, ఉపకరణాల ఆధారంగా ఒకరి భక్తిని అంచనా వేయకూడదని, ఆమె ఉద్దేశం భక్తితో ప్రార్థించడమే అయినప్పుడు దీనిని అనవసరంగా వివాదం చేయాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విమర్శలపై నటి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

