
కృష్ణా జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. మచిలీపట్నానికి చెందిన వృద్ధ దంపతులు అలివేలు, మంగమ్మలను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.43 కోట్లు దోచుకున్నారు. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు, రూ.587 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఉపయోగించిన బ్యాంక్ కార్డుతో వారి ఖాతాకు సంబంధం ఉందని నమ్మించారు. అంతేకాకుండా బాధితులపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే వెంటనే డబ్బు బదిలీ చేయాలని బెదిరించారు. వారి మాటలను నిజమని విశ్వసించిన వృద్ధ దంపతులు జూలై 10 నుంచి జూలై 29 మధ్య మూడు విడతల్లో తమ మూడు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.43 కోట్లు కేటుగాళ్ల ఖాతాలకు బదిలీ చేశారు.
అంత పెద్ద మొత్తాన్ని తీసుకున్న తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆగకుండా, మరో రూ.95 లక్షలు పంపించాలని బాధితులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అవసరమైతే ఇంట్లో ఉన్న బంగారం, వెండి తాకట్టు పెట్టైనా డబ్బు చెల్లించాలని బెదిరించారు. దీంతో అనుమానం వచ్చిన వృద్ధ దంపతులు తమకు పరిచయమైన వ్యక్తులతో విషయం పంచుకోగా, ఇది సైబర్ మోసం అని గుర్తించారు. అనంతరం వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు, డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు, ఫోన్ కాల్ వివరాలు, నిందితుల జాడపై దర్యాప్తు ప్రారంభించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ లేదా డబ్బు బదిలీ చేయాలని కోరే ఆదేశాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను లేదా జాతీయ సైబర్ హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

