
తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు తీపి కబురు. ప్రజలకు పౌష్టికాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు జొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను నేరుగా రేషన్ షాపులు, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్రం మద్దతు లేకపోయినా, యాసంగి సీజన్లో పండించిన జొన్నలకు రాష్ట్ర నిధులతోనే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది.
మంగళవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను మార్కెట్ వేలంలో కాకుండా నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదని ప్రభుత్వం సేకరించిన పంట నేరుగా సామాన్యుడి చెంతకు చేరుతుందని అన్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంలో జొన్నలను చేర్చాలని నిర్ణయించారు. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా పోషకాహార లోపంతో బాధపడకూడదని భట్టి సూచించారు.
మరోవైపు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో జొన్నలు, మొక్కజొన్నల ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోయినా రాష్ట్ర సొంత నిధులతోనే యాసంగి పంటను సేకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న సేకరణ కొనసాగుతుండగా.. ఇప్పుడు జొన్నలను కూడా అదే రీతిలో సేకరించనున్నారు.

