
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం పొందేలా ‘చాయ్ రాస్తా’ పేరుతో టీ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో చాయ్ రాస్తా ఔట్లెట్లు ప్రారంభం కాగా.. అనంతపురం జిల్లాలోనూ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో డీఆర్డీఏ-సెర్ప్.. ఆయా రంగాల్లో అనుభవం ఉన్న సంస్థలతో రాష్ట్రస్థాయిలో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా సెర్ప్ ‘చాయ్ రాస్తా’ బ్రాండ్తో టీ స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
కంటైనర్తో పాటు పూర్తి సామగ్రి
చాయ్ రాస్తా ఫ్రాంచైజీ తీసుకునే మహిళలకు కంటైనర్తో పాటు అవసరమైన సామగ్రిని అందిస్తారు. టీ, కాఫీతో పాటు బిస్కెట్లు, కూల్డ్రింకులు వంటి ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్టాల్ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించడం, డాక్యుమెంటేషన్, లైసెన్సులు, మార్కెటింగ్, వ్యాపార శిక్షణ తదితర అంశాల్లోనూ సహకారం అందిస్తారు.
రూ.4 లక్షల వరకు రుణ సదుపాయం
చాయ్ రాస్తా ఏర్పాటు చేసుకునేందుకు డీఆర్డీఏ, స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.4 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అలాగే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ (PMEGP) కింద రూ.4 లక్షల రుణం పొందితే రూ.1.40 లక్షల వరకు రాయితీ లభించే అవకాశం కల్పించారు.
రోజువారీ వ్యాపారాన్ని బట్టి ఆదాయం
చాయ్ రాస్తా ఔట్లెట్ నిర్వహించే ప్రాంతాన్ని బట్టి ఆదాయం మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు రూ.5 వేల వ్యాపారం జరిగితే నెలకు రూ.40 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. రోజుకు రూ.10 వేల వ్యాపారం జరిగితే నెలకు రూ.లక్ష వరకు, రూ.20 వేల వ్యాపారం జరిగితే నెలకు రూ.2.50 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అనంతపురంలో 30 ప్రాంతాల ఎంపిక
అనంతపురం జిల్లాలో చాయ్ రాస్తా స్టాల్స్ ఏర్పాటుకు అనుకూలమైన 30 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. టోల్గేట్లు, జాతీయ రహదారులు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ చాయ్ రాస్తా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
మహిళలు తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని సాధించేలా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

