
అభ్యుదయ భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సామాజిక విశ్లేషకుడు సూదిని పద్మారెడ్డి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. పుదుచ్చేరిలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో పాటు తెలంగాణ నుంచి పద్మారెడ్డి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గత 25 ఏళ్లుగా విద్యా రంగంలో, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆయన అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది.
తెలంగాణలో సామాజిక, విద్యరంగంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభ్యుదయ భారత్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సూదిని పద్మారెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ యునైటెడ్ అమెరికన్ వర్సటీ ఆయనకు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. దేశవ్యాప్తంగా మానవీయ, సామాజిక, విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖులను గుర్తించి ఈ యూనివర్సిటీ ఏటా డాక్టరేట్లు అందిస్తుంది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని కలైరంగమ్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కన్వకేషన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సూదిని పద్మారెడ్డి ఈ గౌరవ డాక్టరేట్ను స్వీకరించారు.
డాక్టరేట్ తీసుకున్న అనంతరం పద్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ ద్వారా చేస్తున్న చిన్న సేవలను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని.. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ప్రకటించారు.

