ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన యువతి అదీబా అక్కడే అదృశ్యమైందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదీబా 2025 నవంబర్లోనే దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె కనిపించకుండా పోయినట్లు తేలడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణ వివరాలు, మొబైల్ డేటా తదితర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ యువతి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

దుబాయ్లో ఉద్యోగం కోసం వెళ్లిన యువతి అదృశ్యమైందని భావించిన కుటుంబానికి, పోలీసుల దర్యాప్తులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి దుబాయ్లో కనిపించకుండా పోలేదని, నెలల క్రితమే హైదరాబాద్కు తిరిగి వచ్చి ఆ తర్వాతే అదృశ్యమైనట్లు పోలీసులు గుర్తించారు.
టోలిచౌకికి చెందిన షాహిదా బేగం కుమార్తె అదీబా (24) 2025 ఆగస్టులో ఉద్యోగం కోసం దుబాయ్కు వెళ్లింది. కొంతకాలం పాటు కుటుంబ సభ్యులతో ఆమెకు సంబంధాలు కొనసాగినా, అనంతరం ఒక్కసారిగా సంప్రదింపులు నిలిచిపోయాయి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె దుబాయ్లోనే కనిపించకుండా పోయిందని భావించి పోలీసులను ఆశ్రయించారు.
మొదట టోలిచౌకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కాగా, విదేశాలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లినందున కేసును ఆర్జీఐ ఎయిర్పోర్టు పోలీసులకు బదిలీ చేశారు. ప్రయాణ వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు.. అదీబా 2025 నవంబర్లోనే హైదరాబాద్కు తిరిగి వచ్చినట్లు గుర్తించారు. అయితే ఇంటికి వెళ్లకుండానే ఆమె అదృశ్యమైనట్లు తేలడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
ప్రస్తుతం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎవరినైనా కలిసిందా? స్వచ్ఛందంగా వెళ్లిందా? లేక మరో కారణం ఉందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
దుబాయ్లో యువతి అదృశ్యమైందన్న సమాచారం వాస్తవం కాదని, ఆమె హైదరాబాద్కు తిరిగి వచ్చిన అనంతరమే కనిపించకుండా పోయినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. యువతి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

