
భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా మధ్య కొనసాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెటాకు నోటీసులు జారీ చేయగా, తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్తో పాటు పలువురు సోషల్ మీడియా వినియోగదారులపై కేసు నమోదు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ఓ వీడియోను కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీజేపీ నిరసనలకు సంబంధించిన అసలు వీడియోను ఎడిట్ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీప్ఫేక్ కంటెంట్ రూపొందించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా విస్తృతంగా షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ వీడియోలు ప్రజల్లో అపోహలు సృష్టించే అవకాశముందని, భారతీయ న్యాయ సంహిత (BNS), సమాచార సాంకేతిక చట్టం (IT Act)లోని పలు నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. డీప్ఫేక్ వీడియోలను ఎవరు రూపొందించారు? అవి సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యాయి? ప్లాట్ఫామ్ భద్రతా వ్యవస్థల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
ఇటీవల మెటా ప్రతినిధులను విచారణకు పిలిపించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు, AI స్కామ్లు, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్ కంటెంట్ను గుర్తించి తొలగించే విధానాలపై వివరణ కోరారు. దీనికి స్పందించిన మెటా ప్రతినిధులు తమ కంటెంట్ మోడరేషన్ విధానాలు, భద్రతా చర్యల వివరాలను అధికారులకు సమర్పించారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. డిజిటల్ ఆధారాలు, సాంకేతిక విశ్లేషణ ఆధారంగా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు పూర్తైన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

