
దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు ఇటీవల స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ, వివిధ కారణాల వల్ల జాప్యం చోటుచేసుకుంది. తాజాగా, ఈ జాప్యంపై జపాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ మంత్రి కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోందని, తమ టెక్నాలజీని కూడా వినియోగించడం లేదని ఆయన ఆరోపణ చేశారు. ఈ ప్రాజెక్ట్కు జపాన్ ఆర్థిక సహకారం అందిస్తుండటంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
భారతదేశంలో మొట్టమొదటిహైస్పీడ్ ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. జపాన్కు చెందిన ఓ ఇంజినీర్ భారత బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ విషయంలో స్థానిక వార్తాపత్రికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. చర్చల సందర్భంగా భారత అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న హిడేకీ.. ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉండకుండా సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. తాజాగా దీనిపై స్పందించిన భారత్.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలను తోసిపుచ్చింది.
‘‘ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం… వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉంది’’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మీడియా సమావేశంలో ఈ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బదులిస్తూ ‘‘ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం.. వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉంది. ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలుపై భారత్-జపాన్ చర్చలు వాస్తవానికి సానుకూలంగా జరుగుతున్నాయి’’ అని ఆయన తెలిపారు. ముంబయి- అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్కు జపాన్ ఆర్థిక సహకారం అందిస్తోన్న విషయం తెలిసిందే.

