
2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది. మరి ఈ 12 ఏళ్ల ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ఎంత మేరకు అభివృద్ధి పథంలో ముందుకు సాగింది? రాష్ట్రంలోని ఏ ప్రాంతం ఎంత పురోగతి సాగించింది? హామీలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయి? అనే విషయాలను ‘ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆడిట్’ సిరీస్లో తెలుసుకుందాం.
అభివృద్ధిని ప్రభుత్వాలు చేసే ప్రకటనలతో కాదు… ప్రజల జీవితాల్లో కనిపించే మార్పుతో కొలవాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా అన్నది శంకుస్థాపనల సంఖ్యతో కాదు.. ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తయ్యాయి.. ఎంత పెట్టుబడి వచ్చింది.. ఎంతమందికి ఉపాధి లభించింది.. ఎంత సాగునీరు అందింది.. ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంత మార్పు వచ్చింది అనే అంశాల ఆధారంగా అంచనా వేయాలి. అందుకే అభివృద్ధి గురించి చర్చించేటప్పుడు రాజకీయ నినాదాల కంటే గణాంకాలు.. ప్రకటనల కంటే అమలు.. వాగ్దానాల కంటే ఫలితాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ పదాలతోనే కొలుద్దాం. ఇక్కడ రాజకీయాలకు అసలు తావే లేదు. వ్యక్తుల ప్రకటనలకు.. ప్రభుత్వ డాంభికాలకు సంబంధమే లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ఈ కథనాల లక్ష్యం. గత పుష్కర కాలంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఆడిట్ను ఈ కథనాలు మీ ముందు ఉంచుతాయి.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది. అందులోనూ సహజ వనరులు, సుదీర్ఘ సముద్ర తీరం, ప్రధాన నౌకాశ్రయానికి అనువైన భౌగోళిక స్థానం ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర చాలా కాలం అభివృద్ధి పరంగా వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ఈ ప్రాంతానికి ప్రత్యేక హామీలు ఆశల హరివిల్లులు అయ్యాయి. అయితే ఆ హామీలు ఎంతవరకు కార్యరూపం దాల్చాయనే ప్రశ్నకు సమాధానం వెతకడం అవసరం. 2014 నుంచి అభివృద్ధిపై దృష్టి ఉన్నప్పటికీ… 2024 ఎన్నికల తర్వాత ఒక కొత్త రాజకీయ పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికే చెందిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావడంతో, కేంద్ర-రాష్ట్ర సమన్వయం గతంతో పోలిస్తే మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

