
ఆంధ్రప్రదేశ్లో మూడు విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.5,545 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈ మూడు ఎయిర్పోర్టులకు సంబంధించిన టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (TEFR)లను సిద్ధం చేసింది. భూసేకరణతో పాటు సైట్ క్లియరెన్స్కు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖకు ప్రతిపాదనలు పంపించింది.
విమానాశ్రయాల నిర్మాణంతో పాటు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా మొత్తం 9 విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిలో కొన్ని విమానాశ్రయాలకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తొలిదశలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన టీఈఎఫ్ఆర్ (టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్)లను అధికారులు సిద్ధం చేశారు. మూడు చోట్ల అవసరమైన భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సైట్ క్లియరెన్స్ల కోసం ఏపీఏడీసీఎల్ (రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది.
కేంద్రం నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతరం డీపీఆర్ల (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి అవసరమైన సంస్థలను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు విమానాశ్రయాల తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.5,545 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.
విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం హడ్కో నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మూడు ఎయిర్పోర్ట్ల అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం సుమారు 4,618 ఎకరాల భూమిని భూ సమీకరణ విధానంలో సమీకరించాలని ప్రతిపాదించింది.
విమానాశ్రయాన్ని పీపీపీ-డీబీఎఫ్వోటీ (PPP-DBFOT) విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సుమారు రూ.4,419 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.
అదే సమయంలో విమానాశ్రయానికి అవసరమైన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.1,087 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది.
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

