
జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు కామవరం సమీపంలో రెండు పశువులను పెద్దపులి చంపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.
కొండ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న పెద్దపులి. పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి కదలికలను రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

