
కాకినాడలో ఫీజుల చెల్లింపు విషయంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఫీజుల విషయమై మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాకినాడ జగన్నాధపురానికి చెందిన పైలా అరవింద్ ఇంటర్ MPC మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి టర్మ్కు సంబంధించిన రూ.30 వేల ఫీజు చెల్లించలేదనే కారణంతో అరవింద్ తండ్రిని కళాశాలకు పిలిపించి యాజమాన్యం అవమానించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫీజులు చెల్లించలేనప్పుడు చదువులు ఎందుకు అంటూ తమతో చులకనగా మాట్లాడినట్లు వారు తెలిపారు.
తండ్రిని కళాశాలలో అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లికి ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు వచ్చిన వెంటనే ఫీజు చెల్లిస్తామని చెప్పినా యాజమాన్యం తమ పరిస్థితిని అర్థం చేసుకోలేదని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన అరవింద్ బంధువులు, స్నేహితులు కళాశాలలోకి వెళ్లి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తమ కుమారుడిని కోల్పోయామని, ఫీజుల విషయంలో ఇబ్బందులకు గురిచేసి అతడి మృతికి కారణమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

