
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు ఇప్పటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నది. భూసేకరణ కోసం బాధితులకు అధికారికంగా నోటీసులిచ్చి, వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది.
సిటీ బ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు ఇప్పటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నది. భూసేకరణ కోసం బాధితులకు అధికారికంగా నోటీసులిచ్చి, వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.
గ్రామ సభలు ఏర్పాటు చేసి బాధితుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది.మూసీ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అవేమీ పాటించకుండా ఎంఆర్డీసీఎల్ పూర్తి ప్రైవేట్ సంస్థలా వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే తాజాగా గాంధీసరోవర్ ప్రాజెక్టులో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న వారిని రెండు భాగాలుగా విడగొట్టి మభ్యపెట్టేందుకు కుట్ర చేస్తున్నది. ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న బాధితులకు ఎలాంటి నోటీసులు లేకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలాగా నేడు సమావేశానికి రావాలంటూ ఫోన్ల ద్వారా సమాచారమిచ్చారు.
సమావేశానికి బాధితులందరిని పిలవకుండా కేవలం ఒక్కో కాలనీకి ముగ్గురు మాత్రమే రావాలంటూ వేర్వేరు చోట్ల సమావేశం ఏర్పాటు చేసింది. వారిని విభజించి, మభ్యపెట్టి, బెదిరింపులకు పాల్పడేందుకే నోటీసులు లేకుండా సమావేశం నిర్వహిస్తన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు ప్రకారం భూసేకరణ చేపట్టాలనుకుంటే దశలవారీగా గానీ, అందరిని ఒకేచోట చేర్చి అభ్యంతరాలు తీసుకోవాలి. కానీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎవరికీ తెలియకుండా గోప్యంగా సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ చట్టం-2013 నిబంధనలు పాటిస్తే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సహకరిస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఆ అధికారిని తిరిగి తీసుకోవడం కుట్రలో భాగమేనా?
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు రాజేంద్రనగర్ ఆర్డీవోగా కొప్పుల వెంకట్రెడ్డి ఉన్నారు. ప్రారంభం నుంచి భూసేకరణ చట్టానికి మంగళం పాడుతూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనను ప్రభుత్వం ఇటీవల కామారెడ్డి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ మీద పంపించింది. కానీ ఆయన అక్కడ జాయిన్ కాకుండానే ఎంఆర్డీసీఎల్కు తీసుకున్నారు. మూసీ పరీవాహక ప్రజలను మభ్యపెట్టి, గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు నిర్వహించడంలో ఆయన నేర్పిరి కావడంతో డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చినా తిరిగి ఎంఆర్డీసీఎల్లోకి తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ ఆయనపై అనేక భూ దందా ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నంబర్-2 మంత్రికి అత్యంత సన్నిహితుడనే టాక్ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి రాగానే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.

