
నగరంలో కొందరు ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ సమయాల్లో కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆ బాధ్యతను పక్కనపెట్టి హెల్మెట్ నిబంధనల ఉల్లంఘనలపై చలాన్లు జారీ చేయడం పెండింగ్ ఈ-చలాన్లను తనిఖీ చేయడానికే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా రహదారుల విస్తరణ జరగడం లేదు. మరోవైపు ప్రధాన రహదారులకు ఇరువైపులా దుకాణాలు ఆక్రమణలు పెరగడంతో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. దీంతో పలుచోట్ల తరచూ ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. దీనికితోడు కొందరు వాహనదారులు ట్రాఫిక్ సిగ్నళ్లను పట్టించుకోకుండా దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు సాధారణంగా ఒక హెడ్కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ లేదా హోంగార్డును విధుల్లో నియమిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఎస్ఐ సీఐ స్థాయి అధికారులు కూడా ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే కొందరు సిబ్బంది తమకు కేటాయించిన జంక్షన్లలో విధులు నిర్వర్తించకుండా ఒకచోట గుంపుగా చేరుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అలా గుంపుగా నిలిచే పోలీసులు ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ఆపి పెండింగ్ ఈ-చలాన్లు ఉన్నాయా? అని తనిఖీ చేస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు. చలాన్లు పెండింగ్లో ఉంటే వాటిని వాట్సాప్ ఫోన్పే వంటి మార్గాల్లో చెల్లించాలని సూచిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి వాహనాల ఫొటోలు తీసి ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు.

