
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ వెలుగులు కనిపిస్తున్నాయి. కొండపై పవన విద్యుత్తు ఉత్పత్తికి దాతల తోడ్పాటు అందించడంతో టీటీడీకి ఏటా రూ.5 కోట్ల వరకు మిగులుతోంది. కొండపై ఉండే గాలిమరల సాయంతో పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో టీటీడీకి ఏటా రూ.5 కోట్ల వరకు మిగులుతోంది. తిరుమలలో త్వరలోనే ముంబై కంపెనీ సాయంతో మరో గాలిమరను కూడా ఏర్పాటు చేయనున్నారు.
చుట్టూ అందమైన కొండలు, అడవి పచ్చని వాతావరణం, ప్రకృతి రమణీయతతో ఆకట్టుకుంటోంది తిరుమల. కొండపై వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.. అందుకే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య రహితంగా మార్చేందుకు టీటీడీ అవసరమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. దీని కోసం కొండపై సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుతోంది. తిరుమల వెళ్లినప్పుడు మనకు గాలిమరలు పెద్ద, పెద్ద రెక్కలతో తిరుగుతూ కనిపిస్తుంటాయి గుర్తుందా.. వాటి సాయంతో పవన విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఇలా గాలిమరల ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తితో టీటీడీకి డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి.
తిరుమలకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు.. ఈ క్రమంలో కొండపై విద్యుత్తు వినియోగం భారీగా ఉంటోంది. టీటీడీ ఏటా దాదాపు ఆరు కోట్ల యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తుండగా.. అందులో ఐదుకోట్ల యూనిట్ల విద్యుత్ను యూనిట్ రూ.5.06 చొప్పున ఎస్పీడీసీఎల్ నుంచి కొనుగోలు చేస్తోంది. మిగిలిన కోటి యూనిట్ల విద్యుత్ను మాత్రం పవన విద్యుత్తు ద్వారా వినియోగిస్తోంది. ఇలా పవన్ విద్యుత్ ద్వారా ఏటా రూ.5,06,00,000 విద్యుత్తు ఖర్చు మిగులుతోందని చెబుతున్నారు. ప్రతి ఏటా ఇలా రూ.5 కోట్ల వరకు మిగగడం టీటీడీకి ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.
తిరుమలలో సుజలాన్ ఆధ్వర్యంలో 2003లో ఆరు గాలిమరలు ఏర్పాటు చేశారు. ఒక్కో గాలిమర ద్వారా 1.25 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ గాలిమరల్ని తిరుమల కొండపై పాపవినాశనం రోడ్డులో ఉన్న కాకులకోన దగ్గర ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హెచ్వీసీ దగ్గర ఎన్రాన్ కంపెనీ ఆధ్వర్యంలో 230 కిలోవాట్ల సామర్థ్యంతో ఒకటి ఏర్పాటు చేశారు. జీఎన్సీ దగ్గర 800 కిలోవాట్లతో మరొకటి.. జీఎన్సీ ప్రాంతంలో విష్విండ్ ఆధ్వర్యంలో 800 కిలోవాట్లతో మరొకటి ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ముంబైకి చెందిన ఎంఎస్ విష్విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా మరోటి ఏర్పాటు చేయనుండగా ఆమోదం తెలిపారు. తిరుమలలోని జీఎన్సీ దగ్గర మరొకటి ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద తిరుమలలో పవన విద్యుత్
ఉత్పత్తితో టీటీడీకి మేలు జరుగుతోంది.

