
తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ సీజన్కు సంబంధించి బియ్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచింది. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు మార్కెట్ భరోసా పెరగనుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు.. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఇచ్చిన అదనపు కోటాను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు భారీ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణలో రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని గణనీయంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 35 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న తెలంగాణ బియ్యం కొనుగోలు అంచనాను అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి మొత్తంగా 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు భారీ ఊరట లభించనుంది. అధిక దిగుబడులు వచ్చినా రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.
ఈ ఏడాది తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేకరించే బియ్యం పరిమాణాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహా వ్యవసాయ శాఖ కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. సవరించిన అంచనాలకు తాజాగా ఆమోదం తెలిపింది. 43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అంటే సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం కావడం విశేషం.

