
గ్రామాల్లో వెలుగులు నింపాల్సిన నిధులు విద్యుత్ బకాయిల చీకట్లోకి వెళ్లేలా ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన అభివృద్ధి నిధులపై విద్యుత్శాఖ కన్ను పడటంతో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 335గ్రామపంచాయతీల్లో అభివృద్ధి స్తంభించే ప్రమాదం పొంచి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేక, అప్పులు చేసి పనులు చేస్తున్నా. బిల్లుల భారం మా త్రం సర్పంచుల మెడకు చుట్టుకుంటోంది. గ్రామపం చాయ తీలకు కేంద్రప్రభుత్వం పంపిన అభివృద్ధి నిధులు.
ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులకే సరిపోని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణ, వీధిదీపాల మర మ్మతులు, ఫాగింగ్ వంటి అత్యవసరసేవల కోసం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిదులపై విద్యుత్శాఖ కన్నేసింది. జిల్లాలోని 335గ్రామ పంచాయతీల్లో స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్, సంబంధించిన విద్యుత్బిల్లుల బకాయిలు రూ.2,93,34 కోట్లకు చేరడం గమనార్హం.
ఈ పరిణామం గ్రామపాలనలో తీవ్రఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్నది. పంచాయతీల విద్యుత్ బిల్లులను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇటీవల ఆదేశాలు జారీ చేయ డంతో గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 52జే ప్రకారం విద్యుత్చార్జీల చెల్లింపులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది.
మరోవైపు విద్యుత్శాఖ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులకు లేఖలు రాయడంతో నిధుల ను మళ్లించక తప్పనిపరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా, వైరల్జ్వరాల నివారణకు ఫాగింగ్, డ్రైయినేజీల శుభ్రత, చెత్తతొలగింపు అత్యంత కీలకం. ఇటువంటి సమయంలో అందుబాటులో ఉన్న నిధులన్నీ విద్యుత్బిల్లులకే కేటాయిస్తే ప్రజారోగ్యం అగమ్యగోచరంగా మారు తుందని ప్రజాప్రతి నిధులు ఆందోళన చెందుతున్నారు.

