
D news: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతికి ‘సప్తధార’ రోడ్మ్యాప్ను ప్రకటించారు. గత ఐదు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించలేనివాటిని వచ్చే ఐదు నుంచి ఏడు ఏళ్లలో సాధించేలా ఈ ఏడు రంగాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
యువత ప్రతిభ, శక్తి, ఉత్సాహాన్ని దేశ నిర్మాణానికి పూర్తిస్థాయిలో వినియోగిస్తామని మోదీ చెప్పారు. తయారీ, రైతాంగం, సాంకేతికత, గతిశక్తి, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్ పవర్.. ఈ ఏడు ధారలతో భారత్ను మరింత బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.
సప్తధారలోని ఏడు అంశాలు
1. తయారీ రంగం: తయారీని దేశ ఆర్థిక వృద్ధికి గ్రోత్ ఇంజిన్గా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. విడిభాగాల నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తుల వరకు దేశంలోనే తయారు చేసి, ప్రపంచ సప్లయ్ చైన్లో భారత్ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.
2. రైతాంగం: వ్యవసాయం, ఆహార శుద్ధి రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత సంప్రదాయ ఆహారాలు, మిల్లెట్స్, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలను అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దాలని అన్నారు.
3. టెక్నాలజీ: డేటా సెంటర్లు, రోబోటిక్స్, కొత్త తరం టెక్నాలజీలకు భారత్ హబ్గా మారాలని మోదీ ఆకాంక్షించారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా విజయాలను ప్రస్తావిస్తూ మేడిన్ ఇండియా 6జీ దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
4. గతిశక్తి: దేశవ్యాప్తంగా వేగవంతమైన కనెక్టివిటీని పెంచేందుకు కొత్త రహదారులు, ఎక్స్ప్రెస్వేల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మెరుగైన మౌలిక వసతులతో వ్యాపార రంగానికి మరింత ఊతమివ్వాలని అన్నారు.
5. రక్షణ శక్తి: రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా దేశీయ తయారీని పెంచాలని మోదీ అన్నారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలపై మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
6. గ్రీన్ ఎనర్జీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ టెక్నాలజీల్లో భారీ ఆవిష్కరణలు అవసరమని ప్రధాని చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు.
7. సాఫ్ట్ పవర్: యోగా, చేతివృత్తులు, సినిమా, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, సృజనాత్మక రంగాలను భారత సాఫ్ట్ పవర్గా మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే సామర్థ్యం భారత్కు ఉందని, జాతీయ పార్కులు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి మరింత చేరువ చేయాలని అన్నారు.

