
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల వేతనాల చెల్లింపునకు రూ.22.50 కోట్లను విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తోంది. గతంలో 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలలకు సంబంధించిన రూ.45 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో మూడు నెలల వేతనాలు విడుదల చేయడంతో ఇమామ్, మౌజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు.
వీబీ-జీరామ్జీ పథకానికి రాష్ట్రస్థాయి కౌన్సిల్
కేంద్రం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో వీబీ-జీరామ్జీ పథకానికి రాష్ట్రస్థాయి కౌన్సిల్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఛైర్మన్గా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైస్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. పలువురు రాష్ట్ర మంత్రులు, పంచాయతీరాజ్ సంస్థలు, కార్మిక సంఘాలు, బలహీనవర్గాల ప్రతినిధులు కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు.
పథకం కింద ఉపాధి పనులకు హాజరవుతున్న కార్మికుల హక్కుల పరిరక్షణ, పథకం అమలు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారంపై కౌన్సిల్ దృష్టి సారించనుంది. ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశం కానుంది.
1,329 మంది ఎంపీఈవోలకు కొనసాగింపు
రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన సేవలందిస్తున్న 1,329 మంది మండల వ్యవసాయ విస్తరణ అధికారులను (MPEOs) కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరు 2027 మార్చి 31 వరకు లేదా గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల పోస్టులు భర్తీ అయ్యే వరకు.. ఏది ముందైతే అప్పటివరకు సేవల్లో కొనసాగనున్నారు.

