
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు పశ్చిమ బెంగాల్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు భారీ గూఢచర్య వలయాన్ని ఛేదించారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మకంగా కీలకమైన ఫోర్ట్ విలియం, రైల్వే మార్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణలపై పాక్ గూఢచారి రాణా రౌఫ్తో పాటు అతనికి సహకరిస్తున్న మరో వ్యక్తిని బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద భారతదేశానికి సంబంధించిన నకిలీ పత్రాలను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
భారతదేశ భద్రతకు సంబంధించిన మరో కీలక ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగుచూసింది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు పాకిస్థాన్కు చెందిన ఓ అనుమానిత గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరిస్తున్నాడనే ఆరోపణలతో ఓ స్థానిక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలోని కీలక సైనిక స్థావరాలు, రైల్వే వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్కు చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో, నిందితుల కార్యకలాపాల వెనుక మరేదైనా కుట్ర ఉందా? ఎలాంటి విద్రోహ చర్యలకు ప్రణాళికలు రూపొందించారా? అనే కోణాల్లో భద్రతా సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్లోకి ఎంట్రీ..
అరెస్టైన ప్రధాన నిందితుడిని పాకిస్థాన్లోని ఫైసలాబాద్కు చెందిన రాణా రౌఫ్ అలియాస్ వహాబ్ ఆలంగా పోలీసులు గుర్తించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ప్రాంతం, బంగావ్ సమీపంలో ఎస్టీఎఫ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అతడు పట్టుబడ్డాడు.
దర్యాప్తు అధికారుల ప్రకారం.. రాణా రౌఫ్ 2012లో నేపాల్ సరిహద్దుల మీదుగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. కొంతకాలం నేపాల్లో తలదాచుకున్న అనంతరం పశ్చిమ బెంగాల్కు చేరుకుని అక్కడే నివాసం ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో తన అసలు గుర్తింపును దాచిపెట్టి సంచరించేందుకు నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వద్ద నుంచి నిర్దిష్ట చిరునామాతో కూడిన గుర్తింపు కార్డుతో పాటు పలు నకిలీ పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

