
ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినంత సులువుగా టీచర్లను బదిలీ చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని.. వారు ఇకపై విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. ప్రతి 6 నెలలకు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను తెలంగాణలో అమలు చేయడమే లక్ష్యమని.. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని.. అయితే విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ఉపాధ్యాయులతో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన “ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసినంత సులువుగా టీచర్లను బదిలీ చేయలేం” అనే వ్యాఖ్యలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. పరిపాలనా వ్యవస్థలో అధికారుల బదిలీలు ఒక ప్రక్రియగా సాగినా.. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో అనేక సామాజిక, కుటుంబ, విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఉపాధ్యాయుల సమస్యలను సున్నితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

