
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక హంతకుడు రాజ్కుమార్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.ఓ అనాథ శవంగా పరిగణిస్తూ.. పోలీసులే అతడికి అంత్యక్రియలు చేశారు. ముఖ్యంగా కన్న కొడుకు చేసిన ఘోర పాపాలను భరించలేక అతని మృతదేహాన్ని స్వీకరించేందుకు తల్లిదండ్రులు, సోదరుడు నిరాకరించడంతో.. పోలీసులే చేవెళ్ల మున్సిపల్ సిబ్బందితో కలిసి అంత్యక్రియలు జరిపించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య, విధుల్లో ఉన్న వైద్యుల నిరాకరణతో మూడు గంటల పాటు ఆలస్యంగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఒక్కరోజులో అది కూడా ఓ గంట వ్యవధిలోనే ఆరుగురిని బలితీసుకుని రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన కిరాతక హంతకుడు రాజ్కుమార్ జీవితం అత్యంత దయనీయంగా ముగిసింది. దారుణమైన నేరాలకు పాల్పడి మరణించిన అతని మృతదేహాన్ని కన్నవారే తీసుకునేందుకు నిరాకరించారు. రాజ్కుమార్ చేసిన ఘోరమైన తప్పుల వల్ల సమాజంలో తలెత్తుకోలేకపోయిన అతని కుటుంబసభ్యులు, చివరకు అతని అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ముందుకు రాలేదు. దీంతో పోలీసులే చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో స్థానిక శ్మశాన వాటికలో అనాథ శవంగా అతని అంత్యక్రియలను ముగించాల్సి వచ్చింది.
రాజ్కుమార్ మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా.. వారు మొదట అయిష్టత వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసుల విజ్ఞప్తి మేరకు సోమవారం రాజ్కుమార్ తల్లిదండ్రులతో పాటు అతని సోదరుడు వచ్చారు. అయితే ఆసుపత్రి ఆవరణలో నిలిపి ఉంచిన అంబులెన్స్లో ఉన్న రాజ్కుమార్ భౌతికకాయాన్ని చూడగానే వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అతని పాపాల్లో తాము భాగస్వాములం కాలేమంటూ శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించి, అక్కడికక్కడే వెనుతిరిగారు. దీంతో శవపంచనామా పూర్తి చేసిన పోలీసులు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించి, చట్టబద్ధంగా అంత్యక్రియల బాధ్యతను తామే భుజాన వేసుకున్నారు.

