
కాకినాడ జిల్లా కరపలో విచిత్రమైన ఘటన జరిగింది. జులై 18న ఓ ఇంట్లో చోరీ జరిగింది.. దొంగలు బంగారం, డబ్బలు ఎత్తుకెళ్లారు. రెండు వారాల తర్వాత చోరీ చేసిన డబ్బులు, బంగారాన్ని తిరిగి అదే ఇంట్లో దొంగలు విసిరేసి వెళ్లారు. చోరీ చేయడం తప్పేనని.. కాకపోతే చోరీ చేసిన వాటిలో రూ.22వేలు వాడుకున్నామని లేఖ కూడా రాశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేమన్నారు.
ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు సారీ అంటూ లేఖ రాశారు. అలాగే దొంగతనం చేసిన బంగారం, డబ్బుల్ని తిరిగి అదే ఇంట్లో విసిరేసి వెళ్లారు. చోరీ చేసిన డబ్బుల్లో కొంత వాడుకున్నామని.. వాటిని తిరిగి ఇవ్వలేమని లేఖలో ప్రస్తావించారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కరప శివారు రామకంచిరాజునగర్లో నామాల గణేష్ నివాసం ఉంటున్నారు. జులై 18న ఆయన కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లారు.. అదే రోజు దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ.6.50 లక్షల విలువైన బంగారం, రూ.50వేలు డబ్బులు తీసుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై ఇంటి యజమాని గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆశ్చర్యకరంగా.. 15 రోజుల తర్వాత (ఆగస్టు 2న) వేకువజామున దొంగలు చోరీ చేసిన డబ్బుల్ని, బంగారాన్ని తిరిగి గణేష్ ఇంటి ఆవరణలో విసిరేసి వెళ్లిపోయారు. గణేష్ గమనించి చూడగా.. చోరీ చేసిన సొత్తు ఉంది. దొంగలు బంగారం, డబ్బులతో పాటుగా అక్కడ ఓ లేఖను కూడా విసిరారు.. ‘మేము చేసింది తప్పే, మేం రూ.22000 ఇవ్వలేం.. ఎందుకంటే అవి వాడేసుకున్నాం.. సారీ’ అని కాగితంపై రాశారు. దొంగలు చోరీ చేసిన సొమ్మును రెండు వారాలకే తిరిగి ఇంట్లోకి విసరడం చర్చనీయాంశమైంది. దొంగలు నిజాయితీగా రూ.22వేలు మాత్రమే వాడుకున్నామని చెప్పి మిగిలిన సొత్తు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. రూ.22వేలు పోయినా బంగారంతో పాటుగా మిగిలిన డబ్బులు దక్కాయని గణేష్ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా కొన్ని చోరీ కేసుల్లో దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తును తిరిగి తీసుకొచ్చిన ఘటనలు ఉన్నాయి.

