
సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ చాలాకాలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కాంపౌండ్స్ అనేవి పెద్దగా లేవని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఒక బ్యానర్లో పనిచేసే వ్యక్తుల మధ్య మంచి అనుబంధం ఏర్పడితే.. అదే సంబంధం కొనసాగుతుందని, అందుకు ప్రత్యేక ఒప్పందాలు అవసరం లేదని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల కాంపౌండ్స్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
త్రివిక్రమ్తో అనుబంధం ఎలా మొదలైంది?
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. తన బాబాయి (చిన్నబాబు) సినీ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్న సమయంలో తొలి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని భావించారని తెలిపారు. త్రివిక్రమ్ పనితీరుపై ఉన్న నమ్మకం, ఆయన సినిమాలపై ఉన్న అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
‘జులాయి’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్తో తమ కుటుంబానికి ఉన్న బంధం మరింత బలపడిందని నాగవంశీ పేర్కొన్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అనే బ్యానర్ పేరును కూడా త్రివిక్రమ్నే సూచించారని, సంస్థ లోగోను సైతం ఆయనే డిజైన్ చేశారని వెల్లడించారు.
“అప్పటి నుంచి ఇప్పటివరకు త్రివిక్రమ్ బయట బ్యానర్లో సినిమా చేయలేదు. దీనికి ఎలాంటి అగ్రిమెంట్లు లేవు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఒక కుటుంబంలా మారిపోయాం” అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్కు ఎలాంటి షేర్ లేదు
త్రివిక్రమ్ తమ బ్యానర్పై వరుసగా సినిమాలు చేస్తూ ప్రయాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో.. తమవైపు నుంచి కూడా ఆయనకు ఎక్స్క్లూజివిటీ ఇవ్వడం సహజమేనని నాగవంశీ అన్నారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ను ప్రధానంగా త్రివిక్రమ్ సినిమాల కోసమే కొనసాగిస్తున్నట్లు వివరించారు.
అయితే ఈ బ్యానర్లో త్రివిక్రమ్కు వాటా ఉందనే ప్రచారంపై కూడా నాగవంశీ స్పష్టత ఇచ్చారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్లో త్రివిక్రమ్కు ఎలాంటి షేర్ లేదని, ఆయనకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే ఉంటుందని తెలిపారు. అయితే ఆయనకు సంబంధించిన షేర్ సితార ఎంటర్టైన్మెంట్స్లో ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్కు సంబంధించిన ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ కీలకంగా భాగస్వామ్యం అవుతున్నారని నాగవంశీ వెల్లడించారు. సినిమాలకు సంబంధించిన స్క్రిప్టులు, ఇతర ముఖ్యమైన అంశాలపై ఆయన సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు.
త్రివిక్రమ్తో తమ అనుబంధం కేవలం సినిమాలకే పరిమితం కాదని.. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వ్యక్తిగత సాన్నిహిత్యమే తమ ప్రయాణానికి ప్రధాన కారణమని నాగవంశీ పేర్కొన్నారు.

