
టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి.. భక్తులను బురిడీ కొట్టించి.. భారీగా డబ్బులు దండుకుంటున్నారని.. అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ వెబ్సైట్ల ద్వారా శ్రీవారి దర్శనాలు, తిరుమలలో గదులు ఇప్పిస్తామంటూ.. భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన టీటీడీ.. చర్యలు చేపట్టింది. ఫేక్ లింక్లు, వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా నిత్యం లక్ష మందికి పైగా వస్తుంటారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనాలు, వివిధ రకాల సేవల్లో పాల్గొనేందుకు.. భక్తులు ఆన్లైన్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వారు.. నేరుగా తిరుమల కొండకు వచ్చి సర్వ దర్శనాలు, స్లాటెడ్ సర్వ దర్శనాలు (ఎస్ఎస్డీ) టోకెన్లు తీసుకుని.. స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే ప్రతీ నెల ఆయా తేదీల్లో తిరుమల శ్రీవారి సేవలు, దర్శనాలు, ఇతర టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆన్లైన్లో విడుదల చేస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు ఈ టికెట్ల కోసం ఎగబడటంతో హాట్ కేకుల్లా క్షణాల్లో అవన్నీ బుకింగ్స్ అయిపోతూ ఉంటాయి.
అయితే శ్రీవారి దర్శనాలు, వసతి గదులు బుక్ చేసుకునే భక్తులు.. ఆన్లైన్ బుకింగ్ సమయంలో చాలా అలర్ట్గా ఉండాలని.. టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. అచ్చం టీటీడీ వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ను తయారు చేసి.. కొందరు దుండగులు.. భక్తులను మోసం చేస్తున్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టీటీడీ పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించి.. భక్తులను మోసం చేస్తున్న దళారీలపై టీటీడీ విజిలెన్స్ విభాగం మరింత నిఘా పెట్టింది. తాజాగా కేరళకు చెందిన సీకే సురేష్ బాబు అనే భక్తుడు.. కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో తిరుమలలో గదులు ఇప్పిస్తామని నకిలీ వెబ్సైట్ ద్వారా మోసపోయిన ఘటన వెలుగులోకి రావడంతో భక్తులను టీటీడీ అలర్ట్ చేస్తోంది.

