
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం, కాలేజీ యాజమాన్యాల బంద్ల నేపథ్యంలో ప్రభుత్వం సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 16 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు దక్కింది. కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వనుంది.
గత కొంతకాలంగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దీనివల్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. సమయానికి నగదు అందకపోవడంతో యాజమాన్యాలు తరచుగా బంద్లకు పిలుపునిస్తున్నాయి. చర్చల తర్వాత ప్రభుత్వం వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తున్నప్పటికీ, ఈ జాప్యం పునరావృతమవుతోంది. ఈ తరహా ఘటనలు విద్యార్థులపై, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీతో సహా మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. ప్రముఖ ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు కల్పించారు.కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి వారి నుంచి ముగ్గురు ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించారు.

